Wednesday, July 31, 2013

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ : నిపుణులు!

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విజయవాడను ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయవాడ, గుంటూరుల మధ్య కొత్త రాజధాని నిర్మాణం చేపట్టనున్నారు. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేస్తూ కేంద్ర మంత్రి మండలికి నివేదించింది. విభజన తర్వాత ఆంధ్ర, రాయలసీమతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. పదేళ్ళలోపు సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని నిర్మిస్తారు. అయితే, 10 యేళ్లు గడువు ఇచ్చినా, సాధారణంగా కొత్త రాజధాని ఏర్పాటు ప్రక్రియ మూడేళ్లలోపే పూర్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సీమాంధ్ర భౌగోళికంగా చాలా పొడవుగా ఉంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ చూస్తే దూరం చాలా ఎక్కువ. రాజధాని ఏర్పాటుకు అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే స్థలాన్ని ఎంపిక చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా, ప్రభుత్వ భవనాలకు స్థలాల లభ్యత, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఇతర ప్రాంతాలతో రవాణ వసతులను పరిగణనలోకి తీసుకుని రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు.

వీటన్నింటిని చూస్తే విజయవాడను ఎంపిక చేసేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. విశాఖ పట్టణం హైదరాబాద్ తర్వాత ఎక్కువగా అభివృద్ధి చెందిన నగరం కూడా ఇదే. ఇక్కడ పెద్ద ఓడరేవు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రములు కూడా ఉన్నాయి. విజయవాడ - గుంటూరు నగరాల మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ వేలాది ఎకరాల స్థలం అందుబాటులో ఉంది.

రెండు నగరాలు పెద్దవి. రైల్వే స్టేషన్లూ పెద్దవే. నీటి లభ్యత సమస్య లేకుండా పక్కనే కృష్ణా నది ఉంది. గన్నవరంలో విమానాశ్రయం ఉంది. ఇది ఇప్పటికే వ్యాపార రాజధానిగా ఉంది. అటు శ్రీకాకుళం, ఇటు చిత్తూరు జిల్లాలకు మధ్యలో ఉంటుంది. పైగా ఇక్కడ రాజధాని ఏర్పాటుతో జంట నగరాలుగా వృద్ధి చెందుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.