చిరు.. బాలయ్య "లోపాయకారి" ఒప్పందం!

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

రాష్ట్ర రాజకీయ యవనికపై అధికార కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్న వెండితెర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరినట్టు రాజకీయ భోగట్టా. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హంగ్ నెలకొన్నట్టయితే ఈ ఒప్పందం మేరకు అధికారాన్ని పంచుకోవాలని భావిస్తున్నారు.

ఈ మేరకు తలా రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహిస్తూ.. సినీ స్నేహాన్ని రాజకీయ నిజజీతంలోనూ కొనసాగించాలని వారిద్దరు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో తెదేపా అధినేత చంద్రబాబుకు "చెక్" పెట్టాలని ఓ ప్రణాళికను రూపొందించారు.

తొమ్మిదేళ్ళ పాటు అధికారంలో కొనసాగిన చంద్రబాబు.. తమ కుటుంబానికి పెద్దగా ఒరగబెట్టిందీ ఏమీలేదని, తన అన్న హరికృష్ణకు మంత్రిపదవి ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి లాగేసుకున్నారనే అక్కసు బాలకృష్ణలో నెలకొందట. ప్రధానంగా, తన తండ్రి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని యువరత్న ఏమాత్రం మరిచి పోలేదని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.

ప్రస్తుతం సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో గత్యంతరం లేక, పార్టీకి తిరిగి పూర్వవైభవం సమకూర్చేందుకు బావ చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నానని బాలకృష్ణ తన మనస్సులోని మాటను వెల్లడించారట.

అలాగే, చిరంజీవి కూడా తన మదిలోని ఆవేదనను వెండితెర స్నేహితునితో పంచుకున్నట్టు వినికిడి. అంతేకాకుండా, ఎన్నికల ప్రచారంలో తామిద్దరం ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకోరాదనే ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.

ప్రధానంగా, అధికార పంపిణీపైనే వీరిద్దరి మధ్య రహస్య చర్చలు సాగినట్టు సమాచారం. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు తొలుత ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని, రెండో టర్మ్‌లో రెండో వ్యక్తి బాధ్యతలు నిర్వహించేలా అంగీకారానికి వచ్చారట. ఏది.. ఏమైనా, చిరంజీవి రాజకీయ ప్రవేశంతో రాష్ట్రంలో హంగ్ తథ్యమని, ఆ సమయంలో మెగాస్టార్ కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా వుంది.

పెద్దపల్లి బరిలో చిరంజీవి వర్సెస్ రాములమ్మ!

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలంగాణాలో పోటీ చేసే రెండో స్థానం కూడా ఖరారైంది. అటు ఎన్టీపీతో సహా, ప్రజారాజ్యం పార్టీకి మంచి పట్టున్న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మెగాస్టార్ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. దీంతో ఆయనపై పోటీకి మహా కూటమి నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ విజయశాంతిని దించాలని తెరాస నిర్ణయించింది.

బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మహాకూటమి తరపున మున్నురుకాపు అభ్యర్థిని బరిలోకి దించాలని భావించారు. అయితే, ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా సినీ గ్లామర్‌ను సినీ గ్లామర్‌తోనే ఎదుర్కోవాలనే తుది నిర్ణయానికి మహాకూటమి నేతలు వచ్చినట్టు వినికిడి. నిజానికి విజయశాంతిని భువనగిరి నుంచి బరిలోకి దించాలని భావించారు.

అయితే, పెద్దపల్లి బరిలో చిరంజీవి పోటీ చేయడం ఖాయమని తెలియడంతో విజయశాంతిని బరిలోకి దింపాలని మహాకూటమి భావించినట్టు సమాచారం. అయితే మహాకూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది.

ఏ రాజుకి ఓటరన్న కిరీట ధారణం చేస్తాడో..?!!

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

రానున్న లోక్‌సభ ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవిగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ పూర్తి మెజారిటీని సాధించలేదని తెగేసి చెపుతున్నారు. నిజమే... ఇదివరకు జాతీయస్థాయి పార్టీల మధ్య మాత్రమే ద్విముఖ లేదా త్రిముఖ పోటీ ఉండేది. కానీ నేడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు బలోపేతమయ్యాయి. ఉన్న పార్టీలకు తోడు కొత్తగా మరికొన్ని పార్టీలు పుట్టుకొస్తున్నాయి.

దీంతో జాతీయ పార్టీలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ప్రాంతీయ పార్టీల సహకారం లేనిదే నెగ్గుకు రావడం కష్టమైన పని అని తెలుసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్, భాజపాలు రెండూ ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో రహస్య మంతనాలు సాగిస్తున్నాయి.

మరోవైపు వామపక్షాలు తృతీయ కూటమిని మరింత పటిష్ట పరిచి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని కూడగట్టి కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని అహరహం శ్రమిస్తున్నాయి.

ఇక అంతకుముందు ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన దేవెగౌడ సైతం ప్రధాని పీఠంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సంభాషణలను సాగిస్తున్నారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను ఎలాగైనా తృతీయ కూటమిలోకి ఆకర్షించాలన్న ప్రయత్నం కూడా ఇందులో భాగంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి సైతం ప్రధాని రేసులో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి దేశ వ్యాప్తంగా ఆదరణ ఉందనీ, పార్టీ ప్రాబల్యం ఉన్న చోట్ల తమ అభ్యర్థులను పోటీకి నిలుపుతామని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమె దక్షిణాది రాష్ట్రాలలో ఇటీవల కాలంలో బహిరంగ సభలలో పాల్గొంటూ వస్తున్నారు.

ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే... మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం ప్రధాని పదవిపై కన్ను వేశారని వార్తలు వస్తున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకుగాను అత్యధిక స్థానాలను గెలుచుకుని ఓ నిర్ణయాత్మక శక్తిగా అవతరించాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే చంద్రబాబు యువరత్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్... ఇలా నందమూరి వారసులందరినీ రాష్ట్రంలో తలో దిక్కున ప్రచారం చేయించి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు భోగట్టా.

మరి అన్ని సీట్లూ మావేనంటున్న కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య తెలుగుదేశం ఆశలు ఎంతవరకూ నెరవేరతాయో వేచి చూడాల్సి ఉంది. మొత్తమ్మీద మాంద్యంలో సైతం వచ్చే ఎన్నికలలో డబ్బు ధారాపాతంగా పారుతుందని పలు సర్వేలు ఇప్పటికే ఎలుగెత్తి చాటుతున్నాయి. అధికారం దక్కించుకోవడంకోసం మన రాష్ట్రంలో పలు రాజకీయ నాయకులు కోటానుకోట్ల డబ్బులు కుమ్మరిస్తారన్న వాదనలు సైతం వినబడుతున్నాయి.

మరి ఇన్ని పార్టీలు, ప్రత్యామ్నాయాల నడుమ ఓటరన్న ఏ రాజకీయ పార్టీ నేతకు కిరీటం ధరింపజేస్తాడో వేచి చూడాలి.

"హోలిక" అనే రాక్షసి ఎలా చనిపోయిందంటే..?

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

పూర్వం "హోలిక" అనే రాక్షసిని రఘుమహారాజు చంపినట్లు ఉన్న గాథతో పాటుగా మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే..? హోలిక అనే రాక్షసి రోజుకో చంటి బిడ్డను తింటూ ఒక్కో గ్రామంపై విరుచుకుపడుతుండేదట. ఇలా ఒకరోజు ఒక ముదుసలి మనుమడి వంతు రాగా, అది గమనించిన వృద్ధురాలు హోలిక బారినుండి మనుమడితో పాటు ఆ గ్రామానికి చెందిన చంటి పిల్లలను కాపాడే దిశగా ఒక మహిమాన్వితుడైన మహర్షిని శరణువేడుకుంటుంది.

ఆ రాక్షసి ఓ శాపగ్రస్తురాలని, ఎవరైనా ఆ రాక్షసిని నోటికి రాని దుర్భాషలతో తిట్టినట్లైతే దానికి ఆయుష్షు క్షీణించి, మరణిస్తుందని ఋషి ఉపాయమిస్తాడు. దీంతో ఎంతో సంతోషంతో ఆ వృద్ధురాలు ఆ గ్రామవాసులకు ఈ విషయాన్ని చెప్పి, ఆ రాక్షసిని ఆ గ్రామస్తుల చేత అనరాని దుర్భాషలతో తిట్టిస్తుంది. ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత "హోలిక" రాక్షసి కుప్పకూలి మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

హోలిక మరణంతో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ కట్టెలు ప్రోగుచేసి ఆ చితిమంటల్లో "హోలీ రాక్షసి"ని కాల్చివేసి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. ఈ రోజు నుంచే హోలి పండుగ ఆచారంలోకి వచ్చిందని పండితులు అంటున్నారు. ఇదేవిధంగా చైత్ర పాడ్యమి రోజున పితృదేవతలకు అర్ఘ్యమిచ్చి సంతృప్తి పరచి, హోలికా భూమికి నమస్కరిస్తే సర్వదుఃఖాలు తొలగి పోతాయని విశ్వాసం.

ఇకపోతే.. ఉత్తర భారతదేశంలో ప్రారంభించబడిన ఈ పండుగ అలా దక్షిణ భారత దేశానికి కూడా వ్యాపించింది. రాష్ట్రంలోని తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలతో హోలి పండుగను ప్రస్తుతం వైభవంగా జరుపుకుంటున్నారు. చిన్నపెద్ద, ఆడ, మగ తేడా లేకుండా, రంగులు పులుము కుంటూ వసంతాలు చల్లుకుంటూ ఆనంద డోలికలతో తేలియాడుతుంటారు. ఇటువంటి ఆహ్లాదకరమైన హోలి పండుగ సందర్భంగా మనమందరం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిద్దాం...!

హోలికా పూర్ణిమ... నడిచొస్తోంది మీ సౌందర్యవతి

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు.

ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు రంగులతో తడిసి నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలూ-నట్రా మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. కానీ మహాకవి పింగళి సూరన కళాపూర్ణోదయమనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో చెప్పాడు.

పూర్వం శాలీనుడనే పేరుగల నాయకుడుండేవాడు. అతనికి చక్కని శరీరము, సౌందర్యవతి అయిన సుగాత్రితో వివాహమైంది. వివాహమయ్యాక ఆమెను అతనితో పొందుకోసం మొదటిరాత్రి లోనికి పంపారు. ఆ రోజు రాత్రి ఏ మల్లెలూ వాడిపోలేదు. ఏ దుస్తులు నలగలేదు. అసలు ఆమెలో కించిత్ మార్పు సైతం కానరాలేదు.

ఒకటి.. రెండు.. మూడు రాత్రులు ఇదే రీతిలో గడిచిపోయాయి. రాత్రి వేళ ఆమె గదిలోకి వెళ్లడం... ఉదయాన ఎలా వెళ్లిందో అలానే తిరిగి రావడం జరిగింది. దాంతో ఆమె మానసికంగా కుంగి పోయింది. తన సౌందర్యాన్ని చూసి భర్తలో చలనం లేకపోవడంపై మధనపడింది.

ఈ పరిణామాలను గమనించిన బంధువులు పరిపరి విధాల ఆలోచించారు. ఇక ఆమె తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం. సంగతేమిటని అతణ్ణి అడిగేందుకు ఎవరూ సాహసించలేదు. భార్య సుగాత్రికి సైతం భర్త ఏమీ చెప్పలేదు. కానీ ఆమె మాత్రం గదిలోకి వెళ్లడం మానుకోనూ లేదు. ఇలా కాలం గడిచిపోతోంది.

ఒకరోజున అతను తన ఇంటి పెరటి చెట్లకు పాదులు చేస్తున్నాడు. భర్త పాదులు చేయడాన్ని చూసి తను పాదులకు నీరు పోసేందుకు సిద్ధమైంది. పని చేసేది తోటలో కదా.. అని ఆమె తన ఆభరణాలను తీసేసి భర్తను ఆకర్షించాలనే ధోరణితో కాక కేవలం సహజ సౌందర్యంతో చక్కగా ఒంపు సొంపులతో చెట్లకు నీళ్లు పోయడం ఆరంభించింది. ఒకానొక సందర్భంలో అతడు భార్య నీళ్లు పోయడాన్ని గమనించాడు. చిత్రం.. ఆమె అద్భుత సౌందర్యరాశిగా అతనికి తోచింది.

ఒక్క ఉదుటున భార్య దగ్గరకు వెళ్లాడు. ఆమే భుజం మీద చేయి వేశాడు. కలిసి నడిపించాడు. శరీరాల్లో విద్యుత్తు ప్రవహించింది. కాలానికే సిగ్గేసింది. కథ సుఖాంతమైంది. తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన అటకెక్కింది.

ఎందుకిలా జరిగిందీ అంటే... అప్పటి వరకూ ఆమె సకలాభరణాలతో తన సహజ సౌందర్యాన్ని దాచేసింది. నేడు తోట పనిలో సౌందర్యాన్ని భర్త చూసి వివశుడైనాడు. ఆమె జీవితంలో వేయి పున్నములు విరిసాయి.

ఇలాంటి సహజ సౌందర్యం ప్రకృతిలో కనిపించేంది ఖచ్చితందా ఈ శిశిర ఋతువులోనే. ఈ ఫల్గుణ మాసంలోని పూర్ణిమనాడు వికసించే చంద్ర కాంతికి స్త్రీ పురుషుల మనస్సు ఆకాశం నుంచి విరబూసే వెండివెన్నెలలో విహరించాలని తహతహ లాడుతుంది. అందుకే మన పెద్దలు ఈ హోలికా పూర్ణిమను ఫల్గుణ పూర్ణిమనాడు ఏర్పాటు చేశారు.

డబ్బుతో బ్యాట్-బ్యాలట్ వార్!

ఎం ఎచ్ అహెసన్ / హైదరాబాద్

ఒకవైపు టి20 క్రికెట్ సంబరాలు తెస్తున్న ఐపిఎల్ టోర్నమెంట్, మరోవైపు ఉత్కంఠభరితంగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది ఎండాకాలాన్ని మరింతగా మండించబోతున్నాయి. ఏప్రిల్ 16, మే 16 మధ్య 15వ సార్వత్రిక ఎన్నికలు; ఏప్రిల్ 10 నుంచి మే 24 మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండవ టోర్నీ పోటాపోటీగా జనం ముందుకు దూసుకురాబోతున్నాయి. జనం ఊహాశక్తిని గౌరవిస్తూనే, పార్టీల ఆర్భాటపు ప్రచారంతోను, మెలితిరిగిన డబ్బు యంత్రాలతోను బూత్, బ్యాట్ సమరాలు 'మరీ అతిగా' కనిపిస్తుంటే ఆశ్చర్యపోకండి. రాజకీయ ర్యాలీలకు హాజరు కావాలా లేక క్రికెట్ పోటీలకు వెళ్ళాలా లేక పోలింగ్ కేంద్రాలు, స్టేడియాల వద్ద ఎన్నికల కమిషన్, ఐపిఎల్ నిర్వాహకులు నియోగించే వేలాది మంది భద్రతా సిబ్బంది మధ్య పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని ఎలా వెతకాలా అనే డైలమా గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు.

ఇది ఆర్థిక వ్యవస్థ గురించి చర్చా కాదు. వనరులకు కొరత ఉన్నప్పుడు ఎలా సర్దుకుపోవాలా అనే మానవ ప్రవర్తనను అధ్యయనం చేసే సైన్స్ గురించిన చర్చా కాదు. ఈ ఆర్థిక మాంద్యం సమయంలో డబ్బుకు గల ప్రాధాన్యం గురించే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. మెరుగైన భవిత కోసం జాతి పెట్టుకున్న ఆశలతో ఆడుకునే ఖద్దరు ధారులకు, ఫ్లడ్ లిట్ స్టేడియాలలో రంగు రంగుల పైజామాలు ధరించి ఆడే క్రీడాకారులకు పుష్కలంగా ఆ వ్యక్తులే నిధులు సమకూరుస్తుంటారు. డబ్బు సంచులు ఇతోధికంగా ఉన్న సంస్థలు ఖద్దరుధారులకు వోటు వేయవచ్చు. క్రికెట్ ఒక క్రీడ మాత్రమే. కాని బడా వాణిజ్యవేత్తలను వాణిజ్య లావాదేవీలు కొనసాగించేటట్లు చేసే క్రీడ రాజకీయం.

ఆరు వారాల ఐపిఎల్ రెండవ సర్కస్ (టోర్నీ) 'భద్రమైనదే' అని, 'ఎందుకంటే స్పాన్సర్లతో దీర్ఘ కాలిక కాంట్రాక్టులు ఇప్పటికే కుదుర్చుకున్నాం' అని ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి స్పష్టం చేస్తున్నారు. ఆయన మాటలకు 'మా స్పాన్సర్లు, భాగస్వాములు ఇప్పటికీ మాతోనే ఉన్నారు. ఇతర స్పాన్సర్లు ఇప్పుడున్నవారి కన్నా ఎక్కువ చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారు' అని మరొక అర్థం తీసుకోవచ్చు. అయితే, పటిష్ఠమైన బిజినెస్ మోడల్స్ (రాజస్థాన్ రాయల్స్, కోలకతా నైట్ రైడర్స్)కు సంబంధించిన ఫ్రాంచైజీలు ప్రస్తుతానికి ఆర్థికపరంగా ఫర్వాలేదనే స్థితిలో ఉన్నారనేది నిజమే. కాని మాంద్యం ముంచేదే కానీ తేల్చేది కాదు కదా.

ఐపిఎల్ రెండవ సీజన్ సమస్యలతో మొదలు కాబోతున్నది. ఫ్రాంచైజీలు బడ్జెట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రకటనకర్తల కోసం బ్రాడ్ కాస్టర్ ఆత్రంగా ఎదురుచూస్తున్నది. కార్పొరేట్ సంస్థల తాయిలాలు తగ్గిపోయాయి. ఐపిఎల్ ను 'ఇండియన్ ప్రాబ్లెమ్స్ లీగ్'గా తిరిగి నామకరణం చేయవలసి వచ్చేటట్లుంది. ఒక్కసారి ఈ దిగువన పేర్కొన్న పరిస్థితిని విశ్లేషించండి. బజాజ్ అలియన్జ్ తో ఒప్పందం కుప్పకూలిన తరువాత టీమ్ స్పాన్సర్ రాజస్థాన్ రాయల్స్ కు ఇంతవరకు దొరకలేదు. ఇక హెచ్ డిఐఎల్ కోలకతా నైట్ రైడర్స్(కెకెఆర్) తో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కెకెఆర్ కు నోకియాతో గల రూ. 15 కోట్ల ఒప్పందాన్ని రెన్యూ చేసుకొంటే తక్కువ మొత్తం కోసం సంప్రదింపులు జరపవలసి రావచ్చు. దక్కన్ చార్జర్స్ ను టీమ్ స్పాన్సర్ జెపీ గ్రూప్ గుడ్ బై కొట్టింది. ఎయిర్ సెల్ తో చెన్నై సూపర్ కింగ్స్ కు గల రూ. 13.6 కోట్ల ఒప్పందం కూడా ధరల కోతను ఎదుర్కోవలసి రావచ్చు.

టివి ప్రకటనల స్లాట్ రేట్లు పది సెకన్లకు రూ. 4 లక్షలకు పెంచడంతోను, ఒక్కొక్కరు కనీసం రూ. 20 కోట్ల మేర నిధుల కొరతను ఎదుర్కొంటున్న ఫ్రాంచైజీలు లాభాలు ఆర్జించే ఉద్దేశంతో స్టేడియాల లోపల ప్రకటనల ధరలను పెంచడంతోను 2008లో చేతికి ఎముక లేనట్లుగా ఖర్చు చేసిన కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు అదే తీరులో తమ నిధులను వెచ్చించే అవకాశం లేకపోవచ్చు. పైగా టిక్కెట్లపై పది శాతం వినోదపు పన్ను వసూలు చేస్తుండడం వల్ల ఐపిఎల్ మ్యాచ్ ల వీక్షణ ఖరీదైన వ్యవహారం కాగలదు.

రాజకీయ ర్యాలీలు టిక్కెట్లు లేని వ్యవహారాలు. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) మార్కెటింగ్ కమిటీ సభ్యుడు, మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా వాదన మరొక విధంగా ఉంది. 'ఒక స్పాన్సర్ తప్పుకుంటే మరొక స్పాన్సర్ వస్తారు' అని ఆయన అంటున్నారు. కావచ్చు. షేర్ విలువలు పతనం అవుతున్నప్పుడు, కార్మికులను తొలగిస్తున్నప్పుడు, టివి ప్రకటనల స్లాట్ లపై దండిగా ఖర్చు చేయడం, గ్రాండ్ స్టాండ్ లలో కార్పొరేట్ బాక్స్ లు, బౌండరీ లైన్ పొడవునా హోర్డింగ్ లు వ్యాపారాన్ని అర్థవంతం చేయవు. గణాంకాలు సరైనవి కావు. చివరకు బికినీ కూడా తక్కువే.