Wednesday, September 11, 2013

జగనే మాయా.. బెయిల్ డీల్ నిజమేనా..?

బెయిల్‌ కోసం డీలంటూ జగన్‌మోహన్ రెడ్డి మీద గురువారం రెండు పత్రికలు పతాక శీర్షికలతో రాశాయి. మంగళవారం జగన్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లు, ఆ మరుసటి రోజు బెయిల్ కోసం కోర్టుకు జగన్ చేసుకున్న దరఖాస్తు.. ఆపై సీబీఐ డీఐజీ వెంకటేశ్‌ బదిలీ వార్తల్ని ఒక్కసారిగా జగన్‌ని తిరిగి వార్తల్లోకెక్కించాయి. దీంతోపాటు సీమాంధ్రలో యాత్ర చేస్తున్న షర్మిల ‘తన అన్న బయటకు వస్తాడని’ పదేపదే చేస్తున్న ప్రకటనలు... కాంగ్రెస్‌తో జగన్ పార్టీ లాలూచీపడినట్లు ఈ పత్రికలు వ్యాఖ్యానించాయి. వీటి మాటలెలావున్నప్పటికీ సీనియర్ కాంగ్రెస్ నాయకులే ఈ వ్యవహారం పట్ల అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే దిశగా ఈ పరిణామాలు దాపురించాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణా నిర్ణయంతో కాంగ్రెస్ అధిష్టానం పాల్పడిన ఘోరమైన తప్పిదానికి తోడు జగన్ విషయంలో అవలంబించబోతున్న వైఖరి మూలంగా కాంగ్రెస్ భూస్థాపితం ఖాయమంటూ ఈ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు జగన్‌కు బెయిలొస్తుందంటూ షర్మిల అంతగట్టిగా ఎలా చెప్పగలుగుతోందని ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ తన బెయిల్ పిటీషన్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక ప్రధాన రాజకీయ పక్షనేతగా తాను ప్రజల్లో వుండవలసిన అవసరాన్ని గుర్తించాలంటూ అభ్యర్థించారు. ఇది గమనించదగిన విషయం.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోనే ఈ బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేసినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టంచేశారు.  సీబీఐ తన ఛార్జిషీట్లు దాఖలు చేయడానికి ఇచ్చిన తుదిగడువు ముగిసిపోవడంతో తమ నాయకుడు బెయిల్ పిటీషన్‌ను ఇచ్చారే తప్ప... అందుకు మరే ఇతర కారణాలతో కానేకాదని చెప్పుకొచ్చారు. సీబీఐ జగన్ అక్రమాస్తుల చివరి చార్జిషీట్‌ను కలుపుకుంటే మొత్తం అభియోగాల పత్రాల సంఖ్య 9 కి చేరుకుంది. ఇక  ఈ చివరి చార్జిషీట్‌ను సీబీఐ కోర్టుకు సమర్పించిన తర్వాత డీఐజీ వెంకటేశ్ తన సొంతరాష్ర్టమైన కేరళకు వెళ్లిపోతారని తెలుస్తోంది.

మొత్తంమీద జగన్ 15 నెలలుగా గడిపిన జైలు జీవితం ముగియబోతోందా..? జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అభియోగాల నుంచి తప్పించుకున్న సబిత ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల విషయంలో సీబీఐ ఉదాసీన వైఖరిని అవలంబించిందా..? కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే జగన్ విషయంలో మెతకవైఖరి అవలంబించిందా..? ఇటీవలకాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి తన దర్యాప్తు వేగాన్ని తగ్గించిందా..? రేపటి రోజున కోర్టులో బెయిల్ కోసం జరిగే వాదనల్లో సీబీఐ లాయర్లు జగన్‌కు అనుకూలమైన వైఖరితో వ్యవహరిస్తారా..? లేకా టూజీ స్పెక్ట్రమ్ కేసులో కనిమొళికి బెయిల్ ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరాలులేవంటూ ఈ విధంగా పక్కకు తప్పుకుంటారా..? ఇవి తాజాగా రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లో నలుగుతున్న ప్రశ్నలు.

Wednesday, July 31, 2013

తెలంగాణ సీఎం డీఎస్... ఏపీ ముఖ్యమంత్రి చిరంజీవి... 2014 పోల్‌కు రెడీ?

180 రోజుల్లో 2 రాష్ట్రాలు... తెలంగాణ సీఎం డీఎస్.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చిరంజీవి. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అత్యంత వేగవంతంగా జరిగిపోతోంది. ఆగస్టు 8న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. కేంద్ర హోంశాఖ అంచనా ప్రకారం కొత్త రాష్ట్రం ఏర్పాటుకు కనీసం 215 రోజులు అవసరమవుతాయి. కానీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ కేవలం 180 రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎంత త్వరగా చర్యలు తీసుకుంటుందో అర్థమవుతుంది.

ఇకపోతే 180 రోజులు.. అంటే మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిని ఏర్పాటు నియమించడంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి నియామకం చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో డి. శ్రీనివాస్ ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి లేదా చిరంజీవిని నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాలంటే 119 అసెంబ్లీ స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 60 ఉండాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మరో 21 మంది ఎమ్మెల్యేల బలం కావాల్సి ఉంటుంది. తెరాస అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో విలీనమయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది.

ఇక సీమాంధ్ర విషయానికి వస్తే... ఇక్కడ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 88 మంది సభ్యుల బలం ఉంటే సరిపోతుంది. ఐతే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 97 సభ్యుల బలం ఉంది కనుక ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఢోకా లేదు. కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పరిచి 2014 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని ప్రచారం జరుగుతోంది. చూడాలి... కాంగ్రెస్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో...?

దారిలో తెలంగాణ... ట్రాకెక్కుతున్న గూర్ఖాలాండ్, మాయ యూపీ డిమాండ్

56 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేశామని కాంగ్రెస్ పార్టీ గొప్పగానే చెప్పుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పట్టాలెక్కించి యమస్పీడుగా పరుగులు తీయిస్తోంది. సీమాంధ్ర ప్రాంత వాసులు నదీ జలాలు, రాష్ట్ర రాజధాని విషయం ఏంటని అడుగుతున్నప్పటికీ, ఆ విషయంపై స్పష్టత ఇవ్వకనే తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా పిలుపు కూడా పంపింది.

తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆవిర్భావం జోష్‌లో ఉండగా సీమాంధ్ర అగ్గిమీద గుగ్గిలంగా మారింది. వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్పష్టమైన ప్రకటనతో, ఇరు ప్రాంతాల మధ్య సమన్వయం సాధించకుండానే నిర్ణయాన్ని ప్రకటించేసింది కాంగ్రెస్. ఫలితంగా రగులుతోంది సీమాంధ్ర.

నిన్న రాత్రి తెలంగాణ ప్రకటన అలా వచ్చిందో లేదో తాజాగా గూర్ఖాలాండ్, మాయావతి చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని 4 ముక్కలు చేయాలన్న డిమాండ్, విదర్భ డిమాండ్ల కందిరీగలు కాంగ్రెస్ చెవుల్లో ఇపుడిపుడే గింగురులు పుట్టిస్తున్నాయి. తెలంగాణ సాధన స్ఫూర్తిగా తీసుకున్న గూర్ఖాలాండ్ డిమాండ్ చేస్తున్న ఉద్యమకారుల్లో ఒకరు బుధవారం ఆత్మహత్య యత్నం కూడా చేశారు. దీంతో అక్కడ యూపీఎలో మంత్రిగా కొనసాగుతున్న కేంద్రమంత్రి వెంటనే రాజీనామా చేశారు. ఉద్యమకారులతో కలసి రాష్ట్ర సాధనకు పోరాటం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

ఇక ఉత్తరప్రదేశ్ మాజీముఖ్యమంత్రి మాయావతి వ్యవహారం. తెలంగాణ ఏర్పాటును స్వాగతించిన మాయావతి, అదే చేత్తో యూపీని నాలుగు ముక్కలుగా చేసి పారేయమని డిమాండ్ చేస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తరప్రదేశ్‌ను విభజించాలని కోరుతున్నారు. ఇక మహారాష్ట్ర నుంచి విదర్భ ప్రాంతాన్ని విడగొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండు కూడా వస్తోంది. ఇలా మొత్తమ్మీద దేశంలో కొత్త రాష్ట్రాల కోసం ఒక్కొక్క డిమాండ్ క్యూ కడుతోంది. వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ఎలా చక్కబెడుతుందో చూడాలి.

పరుగెడుతున్న తెలంగాణ.... ఆగస్టు 8న టి. బిల్లుకు కేంద్రం ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును యూపీఎ సర్కారు చకచకా చేసేస్తుంది. ఆగస్టు 8న తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదే రోజున తెలంగాణ బిల్లు నోట్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపనుంది. ఆగస్టు 9 లేదా 10వ తేదీన తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికై రానుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను యూపీఎ మరింత వేగవంతం చేసింది. ఇదిలావుంటే సీమాంధ్రలో విభజనపై ఆగ్రహజ్వాలలు రేగాయి. అవి అలా సాగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన పని తాను చేసుకుపోతోంది.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రకటించే 'దమ్ము' ఎలా వచ్చిందంటే...?!!

రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ఇవ్వాలన్న దమ్మూ ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు వచ్చింది...? ఎలా వచ్చిందని అంటే విశ్లేషకులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం.

తెలంగాణ ఇవ్వాలన్న నిశ్చయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందుగా సమైక్యవాదనను బలంగా వినిపిస్తున్న కావూరి సాంబశివరావు, చిరంజీవి వంటివారితోపాటు మొత్తం ఏడుగురు ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులను కట్టబెట్టి వారి నోళ్లు మూయించేసింది. 2009 ప్రకటన సమయంలో ఇలాంటి పరిస్థితి లేకపోవడం వల్లనే అప్పుడు వారంతా రోడ్డెక్కారు. కనుక ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు మంత్రి పదవులతో వారి నోళ్లు నొక్కేశారు.

తెలంగాణపై చర్చలు జరుగుతుండగానే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెరాస ఘోరంగా వెనకబడింది. కాంగ్రెస్ 4342, తెలుగుదేశం 4275 సర్పంచి స్థానాల్లో విజయకేతనం ఎగురవేశాయి. దీంతో తెలంగాణపై అనుకూల వైఖరి వల్లనే తమకు మెజారిటీ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ విశ్వసించింది.

తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించే ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది ఎంపీలు కలిసి తమ అంసతృప్తిని వ్యక్తం చేశారు. ఐతే సీమాంధ్రకు కాంగ్రెస్ పార్టీ మోసగించే పని చేయదంటూ సోనియా గాంధీ వారిని బుజ్జగించి నోరు మెదపకుండా చేశారు. ఐతే విభజన ప్రకటన తర్వాత ఎంపీలు చాటుమాటుగా మోసం జరిగిపోయిందంటూ బాధపడటం వేరే విషయం.

రాష్ట్ర విభజన విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియపరిచినప్పుడు ఆయన దానిని తీవ్రంగా వ్యతిరేకించారు. రాజీనామాకు కూడా సిద్ధపడ్డారని సమాచారం. ఐతే ఆయన నిర్ణయాన్ని వాయిదా వేయించి బుజ్జగించి పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సంయమనం పాటించాలని చెప్పి పంపినట్లు తెలుస్తోంది.

ఇక అన్నిటికీ మించి తెరాస చీఫ్ కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తమ పార్టీని విలీనం చేస్తామని బాహాటంగా ప్రకటించేశారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పెద్దలు కొందరు కేసీఆర్తో మాట్లాడి వ్యవహారాన్ని నడిపించారనీ, అందులో కె. కేశవరావు వంటి సీనియర్ నాయకులు ఉన్నారని సమాచారం. ఐతే కాంగ్రెస్ ప్రకటన తర్వాత విలీనం సంగతి తర్వాత చూద్దాం అని కేసీఆర్ చెప్పడం వేరే విషయం. ఇలా మొత్తమ్మీద ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేసింది.