షుగర్ ఉందా.. అయితే అల్జీమర్స్ వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యాధి రావడం వల్ల మరొక వ్యాధి కూడా వచ్చే ప్రమాదముందని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఎక్కువమందికి ఉండే జబ్బుల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. అయితే ఇలా షుగరు వ్యాధి ఉండే వారిలో మరొక ముఖ్యమైన వ్యాధి అల్జీమర్స్ వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
జార్జిటౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు స్కాట్ టర్నర్ పలువురు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆ రోగుల్లో ఎక్కువమందిలో ముందుగా షుగరు వ్యాధి లక్షణాలు బయటపడ్డాయట.
షుగరు వ్యాధి అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందనీ, గ్లూకోజ్ సున్నితత్వాన్ని మెరుగుపరిస్తే మధుమేహం, అల్జీమర్స్ రెండింటినీ మరికొంత ఆలస్యం చేయవచ్చని టర్నర్ చెబుతున్నారు. అల్జీమర్స్ బాధితులందరికీ గ్లూకోజ్ టాలరెన్స్ పరీక్ష చేయించడం మేలని తమ అధ్యయనం ద్వారా తెలుస్తున్నట్టు టర్నర్ వెల్లడించారు.
